సూర్యాపేట, వెలుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మంగళవారం రెండో రోజుల పాటు నిర్వహించిన మెడ్ఎక్స్2025 ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 21 విభాగాలలో 200కు పైగా ఎగ్జిబిట్లను మెడికల్విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయలత మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన 6వేలకు పైగా విద్యార్థులు ఈ ప్రదర్శనలను తిలకించినట్టు చెప్పారు. విద్యార్థులకు వైద్యరంగం పట్ల, ఆరోగ్యం పట్ల చెప్పాల్సిన అన్ని విషయాలను కూడా ప్రదర్శనలో ప్రయోగాత్మకంగా వివరించినట్లు వెల్లడించారు.
చనిపోయిన మనిషి శరీరం చూపిస్తూ మానవ శరీరంలో ఉండే వివిధ భాగాలు పనిచేసే విధానం వివరించారని తెలిపారు. మహిళకు ఎక్కువగా వచ్చే గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్కృష్ణయ్య, పద్మావతి, తరుణి, జెమిమా, రాధిక, బాబురావు, శ్రీకాంత్, గురురాజ్తదితరులు పాల్గొన్నారు.
