
- సీఎం రేవంత్కు చెక్కు అందజేత
హైదరాబాద్, వెలుగు: వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షలు అందజేశారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి చెక్కులను ఇచ్చారు. అమర రాజా గ్రూప్ తరఫున మంత్రి గల్లా అరుణ కుమారి సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందించారు.
సినీ నటులు అలీ రూ.3 లక్షలు, విశ్వక్ సేన్ రూ.10లక్షలు అందజేశారు. సినీ నటుడు సాయిదుర్గా తేజ్ రూ.10 లక్షలు, గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి రూ.25 లక్షలు సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.
జర్నలిస్టు సూర్యప్రకాశ్కు అండగా సీఎం
సీనియర్ జర్నలిస్టు సూర్య ప్రకాశ్ కు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఆయన వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షలు మంజూరు చేశారు. సూర్య ప్రకాశ్ ఢిల్లీలో సాక్షి జర్నలిస్టుగా పని చేస్తున్నారు. మొదడులో బ్లడ్ క్లాట్ కావడంతో మూడ్రోజుల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ తక్షణమే స్పందించారు. వైద్యఖర్చుల కోసం రూ.10 లక్షలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. చెక్కును మంగళవారం ఢిల్లీలో అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.