
- రాష్ట్రంలో మేఘ, బీవైడీల ఈవీ ప్లాంట్!
- రూ. 8,000 కోట్ల పెట్టుబడి
- సెంట్రల్ అప్రూవల్ కోసం అప్లికేషన్
హైదరాబాద్ : ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ బీవైడీలు కలిసి రాష్ట్రంలో ఈవీ మాన్యుఫాక్చరింగ్, ఈవీ బ్యాటరీల తయారీ ప్లాంట్ను పెట్టాలని చూస్తున్నాయి. ఈ ఫెసిలిటీ ఏర్పాటుకు రెండు కంపెనీలు కలిసి రూ. 8,000 కోట్లు (బిలియన్ డాలర్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలుస్తోంది. జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు ప్రపోజల్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ జాయింట్ వెంచర్ ప్రపోజల్పై మాట్లాడేందుకు అటు ఎంఈఐఎల్, ఇటు బీవైడీ గ్రూప్ల ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు సెంట్రల్ కామర్స్ మినిస్ట్రీ, హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీలు కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే పనులు ఊపందుకుంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. హ్యాచ్బాక్ల నుంచి లగ్జరీ మోడల్స్ దాకా అన్ని బీవైడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఇండియాలో తయారు చేయాలనేది లాంగ్టర్మ్ ప్లాన్ గా తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్స్ తయారీలో ప్రపంచంలోనే పెద్ద కంపెనీగా బీవైడీ పేరొందింది. గ్లోబల్గా మూడో పెద్ద కార్ల మార్కెట్ అయిన ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టే ప్లాన్ ఉందని గతంలోనే కంపెనీ వెల్లడించింది. ఎంఈఐఎల్ గ్రూప్లోని ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఎలక్ర్టిక్ బస్సుల తయారీ ఫెసిలిటీ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటికే 150 ఎకరాల స్థలాన్ని పొందింది.
ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోటిక్స్ మాన్యుఫాక్చరింగ్ పెట్టాలని ఒలెక్ట్రా ఆలోచన. ఈ ఫెసిలిటీకి ఏడాదికి 10 వేల బస్సులు తయారు చేసే కెపాసిటీ ఉండొచ్చని చెబుతున్నారు. టిప్పర్లు, ట్రక్కులు, ఎల్సీవీలు, త్రీవీలర్లు, ఇతర ఈవీ ప్రొడక్టుల తయారీ కూడా భవిష్యత్లో చేపట్టాలనే ప్రపోజల్ కూడా కంపెనీకి ఉందని అంటున్నారు. తాజా జాయింట్ వెంచర్ ప్రపోజల్కు కేంద్ర ప్రభుత్వ అప్రూవల్ వచ్చాక, కొత్త ప్రాజెక్టు కోసం స్థలంతోపాటు ఇతర సదుపాయాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలని అనుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఎంఈఐఎల్కి చెందిన ఒలెక్ట్రా గ్రీన్టెక్కు బీవైడీ ప్రస్తుతం టెక్నాలజీ పార్ట్నర్గా ఉంది.