- మారుమూల ప్రాంతాల్లో అధ్వాన్నంగా ఇంటర్నెట్ సౌకర్యం
- వెల్లడించిన ఆక్స్ఫామ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: డిజిటల్ సెక్టార్లో కూడా అసమానతలు పెరిగిపోయాయి. మహిళలతో పోలిస్తే మగవారి దగ్గర ఫోన్లు ఎక్కువగా ఉన్నాయని ఆక్స్ఫామ్ రిపోర్ట్ పేర్కొంది. కిందటేడాది 61 శాతం మందిమగవారి దగ్గర సెల్ఫోన్స్ ఉండగా, మహిళల్లో 31 శాతం మంది దగ్గరే ఫోన్లు ఉన్నాయని వివరించింది. కులం, మతం, జెండర్, నివసిస్తున్న ఏరియా బట్టి ఉన్న అసమానతలు, డిజిటల్ సెక్టార్లో కూడా కనిపిస్తున్నాయని తెలిపింది. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం, డిజిటల్ టెక్నాలజీ దేశంలోని అర్బన్ ప్రజలకు, అప్పర్ క్యాస్ట్ (కులం), అప్పర్ క్లాస్ హౌస్హోల్డ్స్ (ధనవంతుల) కు ఎక్కువగా అందుబాటులో ఉంది. ‘ జనరల్ క్యాస్ట్లోని 8 శాతం మంది దగ్గర కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉంది. అదే ఎస్టీ కులంలోని 1 శాతం మంది దగ్గర, ఎస్సీ కులంలోని 2 శాతం మంది దగ్గర మాత్రమే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉంది. మొబైల్ ఫోన్ల ప్రకారం చూస్తే, మగవారితో పోలిస్తే మహిళలు 2021 లో 33 శాతం తక్కువగా మొబైల్ ఇంటర్నెట్ను వాడారు’ అని ఆక్స్ఫామ్ రిపోర్ట్ వెల్లడించింది. జనవరి, 2018– డిసెంబర్, 2021 మధ్య సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) చేసిన సర్వే డేటాను విశ్లేషించి ఈ రిపోర్ట్ను ఆక్స్ఫామ్ రెడీ చేసింది. ఇంటర్నెట్ , మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఎంత మందికి అందుబాటులో ఉన్నాయి, ఎంత మంది దగ్గర మొబైల్స్, కంప్యూటర్స్ ఉన్నాయి, ప్రభుత్వ డిజిటల్ స్కీమ్స్లలో భాగస్వాములవుతున్నది ఎవరనే అంశాలను విశ్లేషించి ఈ రిపోర్ట్ను తీసుకొచ్చింది.
జాబ్స్ ఉన్నోళ్ల దగ్గరే ఫోన్లు ఎక్కువ..
డిజిటల్ సెక్టార్లో అసమానతలకు ప్రధాన కారణం జాబ్స్ లేకపోవడమేనని ఈ రిపోర్ట్ పేర్కొంది. పర్మినెంట్ ఉద్యోగాలు ఉన్న 95 శాతం మంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయని, అదే నిరుద్యోగుల్లో (ప్రయత్నిస్తున్నా, జాబ్ దొరకని వారు) 50 శాతం మంది దగ్గర మాత్రమే ఫోన్లు ఉన్నాయని తెలిపింది. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం, రూరల్ ఏరియాల్లో కంప్యూటర్ల వాడకం తగ్గింది. కరోనాకు ముందు రూరల్ ఏరియాల్లో 3 శాతం మంది దగ్గర మాత్రమే కంప్యూటర్లు ఉండగా, కరోనా తర్వాత ఈ నెంబర్ ఒక శాతానికి పడిపోయింది. అర్బన్ ఏరియాల్లో కంప్యూటర్లు ఉన్నవారు 8 శాతానికి పెరిగారు. అలానే డిజిటల్గా అందిస్తున్న ఎడ్యుకేషన్, హెల్త్ వంటి సర్వీస్లను పొందడంలో దేశంలో అసమానతలు ఉన్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది. పేదల ఇన్కమ్ లెవెల్స్ను పెంచడం ద్వారా ఆదాయాల మధ్య అసమానతలను తగ్గించొచ్చన్న ఆక్స్ఫామ్, ఈ అంతరం చెరిగిపోవడానికి చాలా టైమ్ పడుతుందని పేర్కొంది. కనీస వేతనాన్ని సరిపడా పెంచడం, పేదలపై ఇన్డైరెక్ట్ ట్యాక్స్ భారాన్ని తగ్గించడం, యూనివర్సల్ హెల్త్, ఎడ్యుకేషన్ సర్వీస్లను తీసుకురావడం ద్వారా వ్యవస్థలో ఆదాయాల అసమానతలను తగ్గించొచ్చని ఈ సంస్థ అభిప్రాయపడింది. డిజిటల్ సెక్టార్లో అసమానతలను తగ్గించాలంటే దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిపించాలని ఆక్స్ఫామ్ రిపోర్ట్ సలహాయిచ్చింది.