- రెండో డోసు వేస్కోకున్నా వేస్కున్నట్టు మెసేజ్లు
- ఫస్ట్ డోస్ డేటా ఆధారంగా కొవిన్ పోర్టల్లో అప్లోడ్
- సెకండ్ డోస్ ఎట్లా? అని జనాల ఆందోళన
- కరోనా టెస్టుల్లాగానే వ్యాక్సిన్ల లెక్కల్లో తేడాలు
హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్ వేసుకోకున్నా వేసుకున్నట్టు జనాలకు సర్టిఫికెట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఒక డోసు వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకు.. రెండో డోసు వేసుకోకున్నా వేసుకున్నట్టు మెసేజ్లు వచ్చాయి. దీంతో సెకండ్ డోసు తీసుకోని వాళ్లంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.16 కోట్ల మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇంకో 1.24 కోట్ల మంది సింగిల్ డోసు తీసుకున్నారు. వీళ్లలో సగం మంది గడువు దాటిపోయినా సెకండ్ డోసు వేసుకోలేదు. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఇదే అదునుగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసినట్టు లెక్క చూపేందుకు సెకండ్ డోస్ వేసుకోనోళ్లకూ వేసుకున్నట్టు సర్టిఫికెట్ను పంపిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగడం లేదు. జనాలు ముందుకు రాకపోతుండడంతో వ్యాక్సినేషన్ స్లో అయిపోయింది. దీంతో కరోనా టెస్టుల సంఖ్యలో చేసిన గోల్మాల్నే వ్యాక్సిన్ల విషయంలోనూ ఎంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి టెస్టులు చేయించుకున్నవారు మళ్లీమళ్లీ టెస్టులు చేయించుకున్నట్టుగా ఆన్లైన్లో ఎంటర్ చేసేవారు. ఇప్పుడు తమ వద్ద ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ల వివరాల ఆధారంగా సెకండ్ డోస్ తీసుకోకున్నా తీసుకున్నట్టుగా కొవిన్ పోర్టల్లో ఎంటర్ చేస్తున్నారు. కొవిన్ పోర్టల్ నుంచి జనాలకు మెసేజ్లు వెళ్తున్నాయి. కొందరు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో డోసు కూడా తీసుకున్నట్టు మెసేజ్లు వస్తుండడంతో.. నిజంగా సెకండ్ డోస్ వేసుకోవాలనుకుంటే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.
రెండు డోసులు తీసుకుంటేనే సేఫ్
కరోనా ప్రభావం తగ్గడంతో వ్యాక్సిన్పై జనాల్లో ఆసక్తి తగ్గింది. గంటలకొద్దీ లైన్లలో నిలబడి ఫస్ట్ డోసు తీసుకున్నవాళ్లే, ఇప్పుడు సెకండ్ డోసు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అయితే ఒక్క డోసుతోనే రక్షణ లభించదని డాక్టర్లు చెప్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే వచ్చే రక్షణపై మన రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ సర్వే చేయించినట్టు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఈమధ్య చెప్పారు. అందులో వ్యాక్సిన్ వేయించుకోనోళ్లే 60 శాతం మంది దవాఖాన్లలో చేరుతున్నట్టు తేలింది. ఫస్ట్ డోస్ వేసుకున్నోళ్లలో వందకు 30 మంది ఆస్పత్రుల్లో చేరుతుంటే.. రెండు డోసులూ తీసుకున్నోళ్లలో కేవలం 10 మంది ఉంటున్నారని వెల్లడైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు డోసులనూ కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకోకుండానే మెసేజ్
నిరుడు జూన్లో నా భర్త, నేను హైదరాబాద్లో కొవిషీల్డ్ ఫస్ట్ డోస్ వేయించుకున్నాం. సెకండ్ డోస్ వేసుకోవడానికి టైమ్ కుదరకపోవడంతో ఇంకా తీసుకోలేదు. ఈ నెల 12న సెకండ్ డోస్ వేసుకున్నట్లుగా మా ఇద్దరికీ మెసేజ్ వచ్చింది. కనీసం మాకు ఎవరూ సమాచారం కూడా ఇవ్వలేదు. కొవిన్ పోర్టల్లోనూ రెండు డోసులు పూర్తయినట్లుగా చూపిస్తోంది. మళ్లీ మేం సెకండ్ డోస్ తీసుకోవాలంటే ఎలానో ఏమో అర్థం కావట్లేదు.
- మార్క రమ్యశ్రీ, హనుమకొండ
నిజామాబాద్లో ఉంటే హైదరాబాద్లో టీకా వేసుకున్నానట
నేను రెండో డోసు తీసుకోనే లేదు. కానీ, తీసుకున్నట్టు మెసేజ్ వచ్చింది. కొవిన్ పోర్టల్లో చూస్తే ఈనెల 13న కొవిషీల్డ్ రెండో డోసు తీసుకున్నట్టు ఉంది. ఆరోజు నేను నిజామాబాద్లో ఉన్నాను. హైదరా బాద్లో ఏదో యూపీహెచ్సీలో రెండో డోసు తీసుకున్నట్టు, రాధ అనే వ్యాక్సినేటర్ టీకా వేసినట్టు సర్టిఫికెట్లో ఉంది. మా ఫ్రెండ్కూ అట్లనే వచ్చింది. ఆయన నంబర్తో ఇద్దరు వ్యాక్సిన్ తీసుకున్నట్టు వచ్చింది.
- రవి, నిజామాబాద్