
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంబంధిత టెక్స్ట్ మెసేజ్లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులతో మిలియన్ల కొద్దీ ఇండియన్ కంప్యూటర్స్పై సైబర్ అటాక్ చేయడానికి కొందరు హ్యాకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు మిలియన్ల కంప్యూటర్స్పై సైబర్ అటాక్ జరగొచ్చని ప్రజలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇండిపెండెంట్ రీసర్చర్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం.. నార్త్ కొరియా బేస్డ్ సైబర్ క్రిమినల్స్ ఈ అటాక్కు ప్లాన్ చేసినట్లు ఇండియా అఫీషియల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్టీ–ఇన్ (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలను వాడుకొని, లబ్ధి పొందాలని హ్యాకర్స్ వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం.
‘ఫ్రీ కరోనా టెస్టింగ్ కోసం సైనప్ అవ్వండి’ అనే సందేశాలతో ఈమెయిల్స్, కంప్యూటర్స్ను హ్యాక్ చేయాలని హ్యాకర్స్ ఎత్తుగడ వేస్తున్నారని అనలిస్టులు చెబుతున్నారు. తద్వారా యూజర్ల బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసి.. వారి అకౌంట్స్లోని డబ్బులను కాజేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఫేక్ లాగిన్ పేజెస్, డౌన్లోడింగ్ మలీషియస్ పేజెస్తో కంప్యూటర్స్ హ్యాకింగ్కు హ్యాకర్స్ సిద్ధమయ్యారని తెలిసింది. సింగపూర్కు చెందిన సైఫిర్మా అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ నివేదిక ప్రకారం.. ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని పర్యవేక్షించే గవర్నమెంట్ ఏజెన్సీలు, డిపార్ట్మెంట్లు, ట్రేడ్ అసోసియేట్స్పై ఈ ఫిషింగ్ అటాక్స్ జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. సైఫిర్మా ప్రకారం.. రెండు మిలియన్ల ఈమెయిల్ అడ్రస్లపై సైబర్ అటాక్స్ జరగొచ్చు. ప్రస్తుతానికైతే ఎలాంటి ఫిషింగ్ అటాక్స్ జరగలేదని, రాబోయే 24 గంటల్లో అటాక్స్కు హ్యాకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.