
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: పేదల కష్టాలను ఏనాడు పట్టించుకోని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం, దూదేకులపల్లి గ్రామాల్లో రూ.4.30 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్లకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.740 కోట్లతో గిరిజన తండాలకు రోడ్లు వేస్తున్నామని తెలిపారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్లు, సోలార్ పవర్ ప్రాజెక్టులు అప్పగిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతుల భూములను కాజేసిందని ఆరోపించారు. రైతుల గోస చూడలేక సీఎం రేవంత్రెడ్డి భూభారతిని తీసుకొచ్చి భూములపై హక్కులు కల్పిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లోని వర్కర్ల సమస్యలు రెండు రోజుల్లో పరిష్కరిస్తామని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, అడిషనల్ ఎస్పీ నరేశ్కుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్కుమార్, అంబాల శ్రీనివాస్ పాల్గొన్నారు.