
- మంత్రి దామోదర వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను త్వరలోనే డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా అప్ గ్రేడ్ గా చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందన్నారు. శుక్రవారం టీవీవీవీ కమిషనర్ అజయ్ కుమార్, డాక్టర్ల సంఘాలతో శుక్రవారం ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో ఖాళీగా ఉన్న 1690 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.
నాన్ టీచింగ్ విభాగంలోని డీఎంఈ, డీహెచ్, టీవీవీపీలలో ప్రమోషన్ల భర్తీకి వయోపరిమితి పెంపుపై కామన్ నిబంధనలు రూపొందించడానికి ఎక్స్ పర్ట్ కమిటీని నియమిస్తామని పేర్కొన్నారు. కాగా.. ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సేవలు అందిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించినందుకు మంత్రికి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు.