45 రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం : హరీష్ రావు

45 రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం : హరీష్ రావు

రానున్న 45 రోజుల్లోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎవరైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటే.. వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తూనే...ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు కోసం ఇటీవలే రూ.86 కోట్లు మంజూరు చేశామన్నారు. నియోజకవర్గంలోని చెరువులను, కుంటలను నీటితో నింపుతామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన మంత్రి హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు. 

దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని, పోరుగు రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఒకరు కూలుస్తామని.. మరొకరు పేలుస్తామని అంటున్నారని సెటైర్ వేశారు. వచ్చే నెల మార్చి నుంచి గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు అందిస్తామన్నారు. ఇందుకోసం రూ.250 కోట్లు కేటాయించామని చెప్పారు. రోజుకు ఒక బోరు మోటారు నడిచేందుకు 150 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోందన్నారు.