
నాగర్ కర్నూల్, వెలుగు: రైతులను వేధించినా, మోసం చేసినా క్రిమినల్కేసులు పెట్టాలని -రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుఅధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్మీటింగ్ హాల్లో ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాలపై సమీక్ష నిర్వహించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రశీదులు ఇవ్వాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి కోడ్ నంబర్ కేటాయించి, ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపిస్తున్నారన్న వివరాలను బస్తాలపై రాయాలని సూచించారు.
మిల్లుల వద్ద వెంటనే అన్ లోడింగ్ జరిగేలా పర్యవేక్షించాలని చెప్పారు. రైతుల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, వంశీకృష్ణ, నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తదితరులు వరి ధాన్యం కొనుగోలులో తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావించారు. రైస్ మిల్లుల యజమానులు తమ సమస్యలను మంత్రికి చెప్పుకున్నారు. కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ అమరేందర్, డీఆర్డీవో చిన్న ఓబులేషు, సివిల్ సప్లై మేనేజర్ రాజేందర్, డీఏవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
కల్వకుర్తి, వెలుగు: అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ ఠాకూర్ బాలాజీ సింగ్, నాయకులు పాల్గొన్నారు.