నా చిన్నతనంలో సిటీలో నెలకోసారి అల్లర్లు జరిగేవి

నా చిన్నతనంలో సిటీలో నెలకోసారి అల్లర్లు జరిగేవి

తన చిన్నతనంలో హైదరాబాద్‌లో నెలకోసారి అల్లర్లు జరిగేవని.. అప్పుడు విద్యార్థులతో పాటు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడేవారని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని మ్యారియెట్ కన్వెన్షన్ సెంటర్‌లో నగరానికి చెందిన వ్యాపారవేత్తలు హుషార్ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, హ్యాండ్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సంపత్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కోవిడ్ ప్రభావం అన్ని రంగాల మీద పడిందని.. నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ‘కోవిడ్ వల్ల నష్టపోయిన చిన్న పరిశ్రమలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్‌ అందిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ కార్యక్రమం ద్వారా ఎంత మందిని ఆదుకుందో నాకు తెలియదు. డిమానిటైజేషన్ వల్ల చిరు వ్యాపారులు ఎన్నో కష్టాలు పడ్డారు. గతంలో కరెంట్ సమస్యలతో చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడేవారు. కరెంట్ కోసం ధర్నాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ వచ్చాక 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. నా చిన్నతనంలో సిటీలో నెలకోసారి అల్లర్లు జరిగేవి. స్కూల్స్, పరిశ్రమలు బంద్ చేయించేవారు. దీనివల్ల విద్యార్థులతో పాటు వ్యాపారులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం సిటీలో అల్లర్లు జరగకుండా చూస్తున్నాం. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చాం. హైదరాబాద్‌ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నాం. సిటీ అవుట్‌స్కట్స్‌లో కొత్తగా వస్తున్న టౌన్‌షిప్‌లకు రోడ్లు వేస్తున్నాం. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీని హైదరాబాద్‌కి తీసుకొచ్చాం. హైదరాబాద్‌తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం. సిటీలో అందుతున్న వైద్యం, విద్య, ఉద్యోగోవకాశాలను జిల్లాల్లో కూడా కల్పిస్తున్నాం. జిల్లాల్లోనూ ఇన్వెస్ట్ చెయ్యాలని వ్యాపారవేత్తలను కోరుతున్నాను. ప్రస్తుతం ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉంది. పాడీ ఇండస్ట్రీలో మనం దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాం. వరి, పప్పు ధాన్యాలు బాగా పండుతున్నాయి. వివిధ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టేలా చూస్తాం. సెక్యురిటి విషయంలోనూ మనమే ముందు ఉన్నాం. నగరంలో 5 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వరల్డ్ క్లాస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ని నిర్మిస్తున్నాం. ఉమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్స్‌ని తీసుకొచ్చాం. పోలీస్‌లకి కొత్త వెహికల్స్ అందించాం’అని ఆయన అన్నారు.

For More News..

హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

టీఆర్ఎస్, బీజేపీలది ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ

డిజిటల్ మీడియా వ్యాప్తికోసం ఇ-కాన్‌క్లేవ్‌

రేప్ చేస్తే అది పనిచేయకుండా శిక్ష