
- లబ్ధిదారుడి ఇంటికి శంకుస్థాపన
- సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం
భద్రాచలం/పినపాక, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో పేదలకు తేడా చేస్తే సహించబోనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. పేదలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలను ఎంపిక చేయాలని ఆదేశించారు. బుధవారం చర్ల మండలం తేగడలో పుల్లరి సుధాకర్, సరోజిని దంపతులు ఇందిరమ్మ ఇల్లు, పినపాక మండలంలోని గొట్టెల్ల గ్రామంలోని ఇందిరమ్మ ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చాలా మంది పేదలకు ఇండ్లు మంజూరు చేయలేదని ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని, ఎలాంటి అవకతవకలు జరగొద్దని హెచ్చరించారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని తెలిపారు. సుబ్బంపేటలో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, లక్ష్మీకాలనీలో రూ.1.16కోట్లతో కట్టిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఎమ్మెల్యే డా.వెంకట్రావు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, పీవో రాహుల్, ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, ఆర్డీవో దామోదర్లతో కలిసి భోజనం చేశారు.
భద్రాచలం పట్టణం చర్ల రోడ్డులో రూ.1.24కోట్లతో నిర్మించే అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ఎమ్మెల్యే వెంకట్రావు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, పీవో రాహుల్ కలిసి మంత్రి భూమి పూజ చేశారు. తాతగుడి సెంటర్లో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. దుమ్ముగూడెం మండలం చిన్నబండిరేవులో రూ.74.5లక్షలతో నిర్మించే అంతర్గత రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్పట్ల కేంద్ర ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.