- బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫైర్
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్ను జనం అసహ్యించుకుంటున్నరు
- పదేండ్లలో ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత బీఆర్ఎస్ది
- 6 గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు అమలు చేస్తున్నట్టు వెల్లడి
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఏం వెలగబెట్టారని కాళేశ్వరానికి వెళ్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫైరయ్యారు. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని తన క్యాంప్ ఆఫీస్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వార్థం, ధన లాభం కోసమే బీఆర్ఎస్సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును ఇష్టారాజ్యంగా కట్టిందన్నారు. పదేండ్లలో ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కిందని, ప్రజల సొమ్మును కొల్లగొట్టి దాచుకున్నారని ఆరోపించారు.
అధికారం పోయాక వాళ్ల అవినీతి మొత్తం బయటకు వస్తున్నదని, ఇప్పుడు కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావును జనం అసహ్యించుకుంటున్నారన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో బీఆర్ఎస్నేతలు మెంటల్ఎక్కి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ వేశామని, మార్చి 2న మరో 6,200 మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని పొంగులేటి చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన 70 రోజుల్లోనే దాదాపు 18,500 జాబ్స్ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదన్నారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను త్వరలోనే ఇస్తామన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్లు ఎవరికైనా రాకపోతే మున్సిపాలిటీ, ఎంపీడీఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించామన్నారు.