
- మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శ
హైదరాబాద్, వెలుగు: ముస్లింలను సాకుగా చూపుతూ బీసీ బిల్లును అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జంతర్మంతర్ ధర్నా లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తూ శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియాతో ఆయన మాట్లాడారు. తమ ఎంపీ రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా బీసీ బిల్లును గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించామని, దాన్ని ఆమోదించి, కేంద్రం అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తో బుధవారం ఢిల్లీలో ధర్నా చేయనున్నామని చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఎలా ఏకమయ్యారో అదే మాదిరిగా ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రతి బీసీ బిడ్డ పార్టీలను పక్కన పెట్టి ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ.. తర్వాత ముస్లింల పేరుతో అడ్డుకునే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.