
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తమకు గత పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక రాలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపామన్నారు. పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన పొన్నం..తెలంగాణకు ఒక గీతం ఉండాలని ప్రజలు మార్పుకోరుకున్నారని చెప్పారు. తెలంగాణ చిహ్నంపై గతంలో ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదని..ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజకీయంగా విమర్శలకు వేదిక కాదని చెప్పారు. ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర గీతం ఆవిష్కరిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వేడుకలు జరుపుకోవాలన్నారు.
తెలంగాణ అమరులను ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారని విమర్శించారు పొన్నం. తల్లిని చంపి బిడ్డను తెచ్చుకున్నారని హేలన చేశారన్నారు. సోనియా తెలంగాణ ఇచ్చిన ప్రదాత.. సోనియా వస్తారనే నమ్మకం ఉందన్నారు.
జయ జయహే తెలంగాణ పాట తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసే శక్తిగా అభివర్ణించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది బిడ్డలు ప్రాణాలు అర్పించారని చెప్పారు. గొప్ప తెలంగాణ ఏర్పడాలని అమరవీరులు కోరుకున్నారు. అమరవీరుల ఆకాంక్షలకు భిన్నంగా పాలన కొనసాగుతోందన్నారు.. బీజేపీ, బీఆర్ఎస్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.