- వీఎఫ్ఎక్స్, గేమింగ్ అభివృద్ధికి కో–క్రియేటర్గా ప్రభుత్వం: మంత్రి శ్రీధర్ బాబు
- ఇండియా జాయ్ 2025 కాంగ్రిగేషన్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ను ఐటీ రాజధానిగానే కాకుండా.. దేశానికి క్రియేటివిటీ హబ్గానూ అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వీఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో రెండ్రోజుల పాటు ఇండియా జాయ్ 2025 పేరిట నిర్వహించనున్న ఇండియాస్ ప్రీమియర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కాంగ్రెగేషన్ను శనివారం ఆయన ప్రారంభించారు. టెక్నాలజీ, క్రియేటివిటీ కలిసే చోటుగా హైదరాబాద్ పిక్సెల్, కవిత్వం, అవకాశాల నగరంగా ప్రపంచానికి మార్గ నిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
క్రియేటివ్ రంగానికి చేయూతనిచ్చేలా క్రియేటివ్ ఫ్యూచర్స్ ఫండ్, ఈస్పోర్ట్స్ అకాడమీ, మహిళా క్రియేటర్ల కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ను ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని దిగ్గజ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తం వీఎఫ్ఎక్స్ అవుట్ పుట్ లో తెలంగాణ వాటా 25 శాతం ఉండటం మనకు గర్వకారణమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇమేజ్ టవర్ ను వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం నియంత్రించేదిగా కాకుండా కో క్రియేటర్గా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, దిల్ రాజు, నటుడు తేజ సజ్జా, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, టీవీఏజీఏ ప్రెసిడెంట్ రాజీవ్ చిలక, కార్యదర్శి మాధవ్ రెడ్డి పాల్గొన్నారు
