
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెనాల్స్పై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని అగ్రికల్చర్ మినిస్టర్తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టి పల్లిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని మంత్రి ప్రారంభించారు. అక్కడే పలు శాఖలకు చెందిన జిల్లా ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజీ కొత్తూరు నుంచి గండుగుల పల్లి వరకు ఎస్ఆర్ఎల్పీపై దాదాపు 2వేలకు పైగా ఎకరాల్లో సోలార్పవర్ ప్లాంట్లతో పాటు పండ్ల మొక్కలు పెంచేందుకు ప్లాన్ చేయాలన్నారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయవచ్చా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాలకు గోదావరి నీళ్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. అధికారులు రైతులను ఒప్పించి భూ సేకరణ చేస్తే ఎస్ఆర్ఎల్పీ కెనాల్స్ తవ్వించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీలో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటులో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భద్రాచలంలోని కోదండ రామాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మారేడు పాక లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే భద్రాచలంలో సాగు నీటికి ఇబ్బంది ఉండదన్నారు. గోదావరి నీళ్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాడుకోవడంతో పాటు అవసరమైతే కృష్ణ బేసిన్కు ఇస్తామని చెప్పారు. పోడు భూముల్లో అవసరమైన మొక్కలు పెంచాలన్నారు.
భద్రాచలం టు కౌటాల వరకు నేషనల్ హైవే నుంచి కిరండోల్ రైల్వే లైన్ను సారపాక వరకు పొడిగించే విధంగా రైల్వే శాఖాధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. చర్ల నుంచి వెంకటాపురం, చర్ల, మణుగూరు ప్రాంతాల నుంచి వందలాది ఇసుక లారీలు రోడ్డుపైనే నిలపడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ములుగు ఎస్పీతో కో ఆర్డినేషన్ చేసుకొని సమస్య పరిష్కరించాలని ఎస్పీ రోహిత్ రాజుకు సూచించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం_పాల్వంచ మధ్యలో గల అటవీ ప్రాంతంలో జూ పార్క్ ఏర్పాటుకు పరిశీలన చేయాలన్నారు.
రోజుకో మొక్క నాటుతున్న విశ్వామిత్ర అనే బాలుడిని మంత్రి అభినందించారు. ఈ ప్రోగ్రాంలో కలెక్టర్ జితేశ్వీ పాటిల్, ఎస్పీ బి. రోహిత్ రాజు, డీఎఫ్ఓ కిష్టాగౌడ్, ట్రైనీ కలెక్టర్ శర్మ, రెడ్కో జిల్లా మేనేజర్ అజయ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు కాంగ్రెస్ నేతలు మోత్కూరి ధర్మారావు, నాగ సీతారాములు, బిక్కసాని నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఆఫీసర్లపై పొదెం ఫైర్ : ఫారెస్ట్ అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ఫైర్ అయ్యారు. వన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తన ఫొటో పెట్టకపోవడంపై ఆయన ఆఫీసర్లపై మండిపడ్డారు.