- మార్క్ఫెడ్ ఎండీకి మంత్రి తుమ్మల ఆదేశం
- జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై సీసీఐ సీఎండీకి మంత్రి ఫోన్
- సీసీఐ విధానాల సవరణకు సంజయ్, కిషన్ రెడ్డి కృషి చేయాలని లెటర్
హైదరాబాద్, వెలుగు: మక్కల దిగుబడి అధికంగా ఉన్న నేపథ్యంలో కొనుగోలు పరిమితిని ఎకరాకు 18.5 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్లకు పెంచాలని మార్క్ఫెడ్ ఎండీని ఆదేశించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 125 కొనుగోలు కేంద్రాల్లో 23,131 టన్నుల మక్కలు సేకరించినట్టు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా..
మార్కెట్లో రైతులకు మద్దతు ధర లభించకపోవడంతో మక్క రైతుల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిందని మంత్రి వెల్లడించారు. ఈ కొనుగోళ్లకు ప్రభుత్వం రూ. 2,500 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేసిందని తెలిపారు. అలాగే, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో ఫోన్ లో మాట్లాడినట్టు మంత్రి తుమ్మల చెప్పారు.
భూసార పరీక్ష పత్రాల పంపిణీ
రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం భూసార పరీక్ష పత్రాల (సాయిల్ హెల్త్ కార్డులు)పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. రైతులు భూసార పరీక్ష చేయించుకోవడం ద్వారా భూమిలోని పోషకాలు, ఎరువుల అవసరాన్ని కచ్చితంగా తెలుసుకొని వ్యయాన్ని తగ్గించుకోవచ్చని, భూమి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని మంత్రి తెలిపారు. ఈ ఏడాదికి జిల్లాకు ఒక మండలం చొప్పున మొత్తం 32 మండలాలకు చెందిన రైతులకు 1,55,000 భూసార పరీక్ష పత్రాలను అందజేసినట్టు తెలిపారు.
