
- కృషి వాస్ ప్రతినిధులతో మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: ఏఐ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన సెక్రటేరియెట్లో కృషివాస్ సంస్థ ప్రతినిధులతో ఏఐ ఆధారిత యాప్లో చేసిన మార్పులు, శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ప్లాంట్ హెల్త్ నిర్ధారణపైచర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రైతులు ఏఐ యాప్ వినియోగంతో పంటలకు కచ్చితమైన నివారణ చర్యలు తెలుస్తాయన్నారు. తెగుళ్లను ముందస్తుగా చర్యలు తీసుకోవడంతో అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. వాతావరణ హెచ్చరికలు, నేల, తేమ, ఆకు తేమ, ఆయిల్ పామ్లో ప్రతి చెట్టు గురించి రియల్ టైమ్ సమాచారం అందించే ఈ యాప్ రైతులకు వరంగా నిలుస్తుందని అన్నారు.కృషివాస్ సంస్థ ప్రతినిధులు తమ ఏఐ టెక్నాలజీ ఆధారిత యాప్ గురించి వివరించారు.
ఈ యాప్ శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా పంటలకు సోకే చీడపురుగులు, రసం పీల్చే పురుగులను ముందస్తుగా గుర్తించి, నిరోధించేందుకు చర్యలు సూచిస్తుందని తెలిపారు. దీనిని "మేకింగ్ ది ఇన్విజిబుల్, విజిబుల్"గా అభివర్ణించారు. రైతులు పొలానికి వెళ్లకుండానే పంటల స్థితిగతులను మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. రియల్ టైమ్లో పంటల డేటా వ్యవసాయ అధికారులకు అందుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.