
- ఆర్ఈసీ చైర్మన్ జితేంద్ర శ్రీవాస్తవకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో వివిధ భారీ నీటి పారుదల ప్రాజెక్టుల కోసం తీసుకున్న రూ. 16 వేల కోట్ల వడ్డీ రేట్లను తగ్గించాలని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేంద్ర శ్రీవాస్తవను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. మంత్రి ఉత్తమ్ ఆహ్వానం మేరకు జితేంద్ర శ్రీవాస్తవ బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు వచ్చారు. ఈ సందర్బంగా రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, కీలక నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడంపై చర్చించారు.
ఈ నేపథ్యంలో ఆర్ఈసీ నుంచి తీసుకున్న వడ్డీరేట్లు తగ్గించి, కాలపరిమితిని పెంచాలని కోరారు. ఈ సడలింపులతో రాష్ట్రం తన ఆర్థిక నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా... లక్షలాది మంది రైతులను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే కీలకమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై జితేంద్ర శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారని మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు.