
న్యూఢిల్లీ : ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసిన ఆదాయానికి, రిపోర్టింగ్ ఎంటిటీల నుంచి అందిన వివరాలకు మధ్య తేడాలు ఉండడంతో పలువురికి ఐటీ డిపార్ట్మెంట్ అడ్వైజరీ నోటీసులు పంపింది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, బ్రోకరేజ్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి సంస్థలను రిపోర్టింగ్ ఎంటిటీలుగా పిలుస్తారు. ‘ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అయ్యాక వీటిని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) ప్రాసెస్ చేస్తుంది. తప్పులేమైనా ఉన్నాయా? నెంబర్స్ మిస్ మ్యాచ్ అయ్యాయా? అని చెక్ చేస్తుంది. తప్పులుంటే సంబంధిత ట్యాక్స్ పేయర్కు నోటీసులు పంపుతారు. ఉదాహరణకు వడ్డీ ఆదాయం లేదా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ను రిటర్న్లో ఫైల్ చేసి ఉండకపోవచ్చు. అలాంటి వారికి నోటీసులు వెళతాయి’ అని డెలాయిట్ ఇండియా పార్టనర్ ఆర్తి రాటే అన్నారు. నెంబర్స్ మిస్ మ్యాచ్ అయితే ఇప్పటికే ఫైల్ చేసిన రిటర్న్స్ను సవరించడం లేదా ఫైల్ చేయకపోతే ఫైల్ చేయడానికి అవకాశం కలిపిస్తామని ఐటీ డిపార్ట్మెంట్ ట్వీట్ చేసింది. నోటీసులు అందుకున్న ట్యాక్స్ పేయర్లు రెస్పాండ్ కావాలని తెలిపింది.