పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్

పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకైనట్టు డీఎంకే ప్రకటించింది. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దురైమురుగన్‌, కోశాధికారిగా టీఆర్‌ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు నేతలు రెండోసారి పదవులు దక్కించుకోవడం గమనార్హం. సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగే ప్రదేశానికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు.. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. డీఎంకె 15వ సంస్థాగత ఎన్నికలలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిలలో పార్టీ పదవులకు జరిగిన ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చిస్తామని డీఎంకే నేతలు స్పష్టం చేశారు.

69 ఏళ్ల అగ్రనేత, దివంగత పార్టీ పితామహుడు ఎం కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ డీఎంకే కోశాధికారి, యువజన విభాగం కార్యదర్శితో సహా ఎన్నో కీలక పదవులను నిర్వహించారు. 2018లో కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టాలిన్ డీఎంకే రెండో అధ్యక్షుడిగా పేరు సంపాదించారు. కరుణానిధి 1969లో డీఎంకేకు తొలి అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా పార్టీలో అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ద్రవిడ ఉద్యమ చిహ్నం, డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, 1969లో ఆయన మరణించే వరకు అత్యున్నత పదవిలో ఉన్నారు. ఇదిలా ఉండగా డీఎంకే 1949లో స్థాపించబడింది.