- కేటీఆర్, హరీశ్, కవితను కేసీఆరే దగ్గరుండి పంపిస్తరు: రాజగోపాల్ రెడ్డి
- బీఆర్ఎస్కు బీజేపీనే శ్రీరామ రక్ష
- నాకు హోంమంత్రి కావాలనుంది.. అయితే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే
- మా ఫ్యామిలీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని అనుకోవట్లే
- పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీశ్, కవితను కేసీఆరే దగ్గరుండి బీజేపీలోకి పంపుతారన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీకి బీజేపీనే శ్రీరామ రక్ష అన్నారు. బీజేపీకి మద్దతివ్వకుంటే కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోతుందన్నారు. ‘కేసీఆర్ తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. అందుకే తన కుటుంబ సభ్యులను బీజేపీలో చేరమని పంపిస్తారు’ అని అన్నారు. అసెంబ్లీ సెషన్ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్నారు. తనకు హోం మంత్రి కావాలని ఉందని, తాను హోం మంత్రిని అయితే బీఆర్ఎస్ లీడర్లు కంట్రోల్ ఉంటారని, వాళ్లను జైల్లో వేస్తానని పేర్కొన్నారు.
కేసీఆర్ను గద్దె దించేందుకే వచ్చా
కేసీఆర్ను గద్దె దించేందుకే తాను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను బీజేపీలోనే ఉంటే ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవకపోయేవాడినా అని ప్రశ్నించారు. లేదంటే ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి పొందకపోయేవాడినా అని అన్నారు. పదవి తనకు బీజేపీలో ఉన్నా వచ్చేదన్నారు. కేసీఆర్ను రాష్ట్రంలో గద్దె దించాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్న ఉద్దేశంతోనే పార్టీలో తిరిగి చేరానని తెలిపారు. కేసీఆర్, బీఆర్ఎస్పై జనంలో కోపం ఉందని, నల్గొండలో కేసీఆర్ సభ పెట్టినా ఒరిగేదేమీ ఉండదని అన్నారు. వారికి ఏమీ లేకనే కేఆర్ఎంబీ పేరిట డ్రామా మొదలు పెట్టారన్నారు. తమ కుటుంబ సభ్యులు నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో పోటీ చేయదలుచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తామని తెలిపారు. తమను పోటీ చేయాలంటూ పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామని, వేరే వారికి టికెట్ఇచ్చినా మద్దతు ప్రకటిస్తామని చెప్పారు.
లాబీలో కేటీఆర్, రాజగోపాల్ మధ్య ఆసక్తికర చర్చ
అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందంటూ రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించగా.. పదవిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు పడిన ఫ్యామిలీ పాలిటిక్స్ మచ్చే తమకూ పడుతుందని రాజగోపాల్ రెడ్డి సమాధానమిచ్చారు. ఫ్యామిలీ పాలన కాదని, మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ ప్రతి జవాబునిచ్చారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తున్నారా.. లేదంటే కుమారుడు సంకీర్త్ పోటీ చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే, తనను కాంట్రవర్సీల్లోకి లాగొద్దంటూ కేటీఆర్కు రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పారు.