
హైదరాబాద్, వెలుగు: తమ కుటుంబంపై ఉన్న కేసులను మాఫీ చేస్తే.. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని కేటీఆర్ తనతో అన్నట్లు ఏపీ ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశ్నించారు. ఆదివారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై చర్చకు రమేశ్ను తీసుకువచ్చే బాధ్యత తనదని, మరి చర్చకు నువ్వు ఎప్పుడు, ఎక్కడికి వస్తావో చెప్పు కేటీఆర్.. అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించడంపై స్పందించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ను విలీనం చేసేందుకు చర్చలు జరిపింది వాస్తవమేనని బండి సంజయ్ కూడా అంటున్నారని, ఇదే విషయాన్ని ఇంతకు ముందు ఆయన చెల్లి కవిత కూడా చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికే పదేండ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను హోల్సేల్గా బీజేపీకి అమ్మడానికి కేటీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్.. బీజేపీ ఒప్పందంలో భాగంగానే కమలం రాష్ట్ర అధ్యక్షుడిగా ఓ డమ్మీని నియమించారని విమర్శించారు.