- జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
అమీన్పూర్(పటాన్ చెరు), వెలుగు: తెల్లాపూర్, అమీన్ పూర్ పరిధిలో మరో రెండు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలని, పటాన్ చెరు, రామచంద్రాపురం కేంద్రాలుగానే సర్కిల్ కార్యకలాపాలు కొనసాగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాల చరిత్రతో పాటు నియోజకవర్గ కేంద్రంగా కలిగిన పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ పటాన్చెరు సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్కు తరలించారన్నారు. అమీన్పూర్ కేంద్రంగా నూతనంగా ఏర్పాటు చేసిన సర్కిల్ కార్యాలయాన్ని రామచంద్రాపురం కేంద్రంగా కొనసాగించాలని కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. పై రెండు అంశాల పైన కమిషనర్ సానుకూలంగా స్పందించారని త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని తెలిపారు.
