చేర్యాల రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేయిస్తా : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేయిస్తా : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
  •      ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల, వెలుగు : చేర్యాల కేంద్రంగా జ్యూడిషియల్​ మున్సిఫ్​ కోర్టును తీసుకువచ్చామని, రెవెన్యూ డివిజన్​ ను కూడా అలాగే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. మున్సిఫ్​ కోర్టు మంజూరైన సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్​ సెంటర్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​ మీట్​లో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్ల కోరికయిన మున్సిఫ్​ కోర్టును సాధించుకోవడంతో ఆనందంగా ఉందన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో మున్సిఫ్​ కోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ​ ఏర్పాటు కూడా త్వరలో జరుగుతుందని తెలిపారు. చేర్యాల మున్సిపల్​ కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 73 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. 

నాలుగు మండలాల్లో దాదాపు రూ. 20 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రూ.3 కోట్లతో  చేర్యాల పెద్ద చెరువు మత్తడి కాలువ నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫొటోకు​ క్షీరాభిషేకం చేశారు. ఈ ప్రాంత లాయర్లు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీలు బి. కృష్ణారెడ్డి, ఉల్లంపల్లి కర్ణాకర్​, తలారి కీర్తన, కొమురవెల్లి టెంపుల్​ కమిటీ చైర్మన్​ గీస భిక్షపతి, మున్సిపల్ వైస్​ చైర్మన్​ నిమ్మ రాజీవ్​రెడ్డి, కౌన్సిలర్లు,  నాయకులు పాల్గొన్నారు.