- ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
పిట్లం, వెలుగు: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మూడో విడత ఎన్నికల్లో పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లిలో గురువారం సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తేనే గ్రామం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ప్రతి పక్ష పార్టీల మోసపూరిత మాటలు నమ్మవద్దని కోరారు.
కాటేపల్లిలో గ్రామం అభివృద్ధి పట్ల మంచి అవగాహన ఉన్న శ్రీదేవి మల్లప్పను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నామినేషన్ కేంద్రానికి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
