
వనపర్తి, వెలుగు: సగరుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో జరిగిన సమావేశంలో సగర సంఘం జిల్లా అధ్యక్షుడిగా మోడల తిరుపతయ్య సాగర్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో సగరులకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్గా గోవర్ధన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీర్ల చందర్ తదితరులకు సముచిత స్థానం కల్పించినట్లు చెప్పారు.
వైఎస్సార్హయాంలో సగరులకు గౌరవం దక్కిందని, తిరిగి నేడు ఆ గౌరవం పొందుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సగరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. సగరులకు కమ్యూనిటీ హాల్, వనపర్తి నల్లచెరువు కట్టపై సగరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణంలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇండ్ల పట్టాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రాయుడు, ట్రెజరర్ సత్యం పాల్గొన్నారు.