
అచ్చంపేట, వెలుగు: నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్చరించారు. ఆదివారం బల్మూర్ మండలం జినుకుంట, తుమ్మన్ పేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వవద్దని వారికి సూచించారు.
నియోజకవర్గంలో 3,500 ఇండ్ల పనులు మొదలయ్యాయని, త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్లు ఇస్తామని తెలిపారు. అంతకుముందు క్యాంప్ ఆఫీస్ లో ఆదివాసీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వెంకట్ రెడ్డి, సుధాకర్ గౌడ్, సురేశ్, నిరంజన్ గౌడ్, తిరుపతిరావు, మసూద్, రమేశ్ ఉన్నారు.
గురువులను గౌరవించాలి..
లింగాల: గురువులను గౌరవిస్తూ వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు. లింగాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్లో చదువుకున్న 2008–-09 టెన్త్ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై చదువుతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి , సామాజిక స్పృహ కలిగించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న టీచర్లను ఎప్పటికీ మరిచిపోవద్దని సూచించారు.
అప్పటి టీచర్లను శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. టీచర్లు గజేంద్ర శ్రీనివాస్, రాంచంద్రయ్య, తిరుపతి రెడ్డి, స్వామి, మహేశ్వరి, శ్రీను, వెంకటస్వామి, పూర్వ విద్యార్థులు నేనావత్ శ్రీనివాస్, క్రాంతి, అనిల్, ఆంజనేయులు, శ్రావణ్, శివ, సైదమ్మ, మమత ఉన్నారు.