దేవుడు నష్టం జేసిండు.. ఆయనే న్యాయం జేస్తడు: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

దేవుడు నష్టం జేసిండు.. ఆయనే న్యాయం జేస్తడు: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

మెట్ పల్లి, వెలుగు: ‘ఇటీవల వర్షాలకు పొలాలు, రోడ్లు, బ్రిడ్జిలు వరద ప్రవాహానికి కొట్టుకొని పోయినయ్​. భగవంతుడు రైతులకు నష్టం జేసిండు.. ఆయనే న్యాయం జేస్తడు’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. సోమవారం మెట్ పల్లి మండలంలో వరద ప్రవాహానికి నష్టపోయిన పలు గ్రామాలను ఆయన సందర్శించారు. రంగారావుపేట్, కేసీఆర్​తండా, ఏఎస్ఆర్ తండాల్లో కోతకు గురైన రోడ్లు, బ్రిడ్జిలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేని వర్షాలతో వరి, మొక్కజొన్న రైతులు నష్టపోయారన్నారు. సమగ్ర సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానన్నారు. 

గతంలో వరదలకు పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఎకరానికి పది వేలు నష్టపరిహారం ఇచ్చారని, ఇప్పుడు కూడా ఇస్తారనే విశ్వాసం ఉందన్నారు. ఆర్అండ్ బీ, పంచాయత్ రాజ్, వ్యవసాయ శాఖ అధికారులతో మీటింగ్ నిర్వహించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. రైతులు అధైర్య పడొద్దని, జరిగిన నష్టం మన చేతుల్లో లేదని భగవంతుడు చేసిన నష్టం కాబట్టి ఏదో ఒక విధంగా ఆయనే న్యాయం చేస్తాడన్నారు. ఎంపీపీ మారు సాయిరెడ్డి పాల్గొన్నారు.