- కాంగ్రెస్లో చేరిన పలువురు బీఆర్ఎస్ సర్పంచులు
- పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు : త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వంద శాతం ఫలితాలు సాధిస్తామని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్, హన్వాడ మండలాల్లోని మొత్తం 60 సర్పంచ్ స్థానాలకు 40 స్థానాల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించి, ప్రజలు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు.
జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీసీసీ ఆఫీసులో మంగళవారం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచులను అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అంతకుముందు అప్పాయిపల్లి సర్పంచ్ నజీర్, ఉప సర్పంచ్ చందు, రేగడిగడ్డతండా సర్పంచ్ వెంకట్ నాయక్, ఉప సర్పంచ్ రాములు నాయక్, మాచన్పల్లి గ్రామ బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, అప్పాయిపల్లి మాజీ సర్పంచ్ ఊషన్న, మాజీ వార్డు సభ్యులు, పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ చౌరస్తా, రాజేంద్రనగర్, భగీరథ కాలనీ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో టెన్త్ చదువుతున్న స్టూడెంట్లకు ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ఫ్రీగా పంపిణీ చేశారు. మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్లో బాలింతలకు వైఎస్ఆర్ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మార్చాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి, కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, బెక్కెరి మధుసూదన్ రెడ్డి, మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వసంత, డీసీసీ ఉపాధ్యక్షుడు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవేజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
