
చిన్న చింతకుంట, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నారాయణ పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి విడుదల చేశారు. అనంతరం నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి మాట్లాడుతూ.. రైతులు అడిగిన వెంటనే కోయిల్ సాగర్ సాగునీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు.
కాంగ్రెస్ హయాంలో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించి 70 ఏళ్లు గడుస్తున్నా చెక్కుచెదరలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కొన్నేళ్లకే పగుళ్లు వచ్చి కుంగిపోయిందని విమర్శించారు. దేవరకద్ర ఎమ్మెల్యే దేవరకద్ర మండలం గురకొండ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ, బీసీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.