కవిత బెయిల్ పిటిషన్​పై ఇవ్వాల తీర్పు

కవిత బెయిల్ పిటిషన్​పై ఇవ్వాల తీర్పు
  • సీబీఐ, ఈడీ కేసుల్లో గత విచారణలో ముగిసిన వాదనలు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​పై సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది. లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు తనను అక్రమంగా అరెస్టు చేశాయని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగించిన ట్రయల్ కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఉదయం 10 గంటలకు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును చదివి వినిపించనున్నారు.

 కాగా.. లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. అనంతరం ఆమెకు ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న తనకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కవిత తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ.. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం.. కవిత మహిళ కనుక బెయిల్​కు అర్హురాలని కోర్టుకు నివేదించారు. అప్రూవర్ల స్టేట్మెంట్లే తప్ప.. సరైనా ఆధారాలు లేనందున కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. . కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఆమె బయటికి వస్తే కేసును ప్రభావితం చేస్తారని.. అందువల్ల బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ తరఫు అడ్వకేట్లు కోరారు. మరోవైపు, కవితకు కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 7తో ముగియనుంది. దీంతో గత ఆదేశాల మేరకు ఆమెను మంగళవారం ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది.