బైకుపై కూలిన సెల్ టవర్.. వ్యక్తి మృతి

బైకుపై కూలిన సెల్ టవర్.. వ్యక్తి మృతి
  • మరో మహిళకు రెండు కాళ్లు విరిగాయ్
  • తాడేపల్లిగూడెం పట్టణంలో ఘటన

పశ్చిమ గోదావరి జిల్లా: అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలులకు ఓ సెల్ టవర్ కూలిపోయింది. సరిగ్గా రోడ్డుపై వెళ్తున్న బైకుపై కూలడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. అతని వెనుక కూర్చుని వెళ్తున్న మహిళ రెండు కాళ్లు విరిగాయి. తాడేపల్లిగూడెం పట్టణంలో తహశీల్దారు కార్యాలయం సమీపంలో సోమవారం జరిగిందీ ఘటన. పట్టపగలు.. అది కూడా రోడ్డుపై ట్రాఫిక్ హడావుడి ఉన్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర ఈదురుగాలుల రావడంతో టవర్ కూలిపోయింది.  కె ఎన్ రోడ్ కు అడ్డంగా టవర్ కూలడం గమనించిన స్థానికులు భయంతో కేకలు వేశారు. టవర్ కూలడం చూసి హెచ్చరిస్తూ కేకలు వేసినా రోడ్డుపై వెళ్తున్న వారికి అర్ధం కాలేదు. అయితే తమ కళ్లెదుటే క్షణాల్లో రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై కూలడంతో.. దానిపై కూర్చుని ప్రయాణిస్తున్న ఇద్దరు ఆర్తనాదాలు చేశారు. తీవ్రంగా గాయపడిన బొట్టా రాజేష్(43) అక్కడికక్కడే మృతి చెందగా అతని వెనుక కూర్చుని ఉన్న మహిళ రాణి రెండు కాళ్లు విరిగాయి. ఈమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సు గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈమెకు తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రురాలికి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.