ప్రధాని మోదీ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ నియంతలా మారారని, ఆయన మళ్లీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదన్నారు. రాజ్యాంగం ఉనికే కనుమరుగవుతుందని చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకుపైగా గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని ఆ పార్టీకి 100 సీట్లు కూడా దాటదని జోస్యం చెప్పారు. తాను పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడినా తన మైక్రోఫోన్ను స్విచాఫ్ చేస్తూ తన ప్రసంగానికి అధికార పార్టీ సభ్యులు అడ్డుతగులుతున్నారని ఆరోపించారు.
రైతులు, కార్మికులు, దళితులు, బీసీలు, గిరిజనులకు మోదీ ఎలాంటి గ్యారంటీ ఇవ్వరని దేశంలోని ఇద్దరు ముగ్గురు సంపన్న పారిశ్రామికవేత్తలకే మోదీ గ్యారంటీ లభిస్తుందని ఆరోపించారు. మోదీ స్నేహితుల రుణాలు దాదాపు రూ.13 లక్షల కోట్లు మాఫీ చేశారని ఆరోపించారు. రైతులకు రుణ మాఫీ చేయక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. సంపన్నులపై విధించే పన్నులు తగ్గిస్తూ పేదలపై పన్ను రేట్లను పెంచుతున్నారని ఖర్గే తెలిపారు.