బెంగళూరు: దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలను అన్వేషించేందుకు, వెలికితీసేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులకు బోలెడు అవకాశాలు ఉన్నాయని ‘ఇండియా ఎనర్జీ వీక్ 2023’ ప్రారంభోత్సవంలో భాగంగా పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్తో సహా రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్ చేయాలని డొమెస్టిక్, ఫారిన్ ఇన్వెస్టర్లను కోరారు. ప్రభుత్వం సరైన నిర్ణయాలను తీసుకుంటోందని, వివిధ సంస్కరణలను చేపట్టిందని పేర్కొన్నారు. దేశంలోని ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో గల ప్రతీ అవకాశాన్ని వెతకాలని, వీటిని ఒడిసిపట్టాలని పిలుపిచ్చారు. ప్రస్తుతం పెట్టుబడులకు ఇండియా సరియైనదని మోడీ అన్నారు. ఎనర్జీ సెక్టార్లో వేగంగా వృద్ధి చెందుతున్నామని, రానున్న పదేళ్లలో ఆయిల్ డిమాండ్ భారీగా పెరుగుతుందని వివరించారు.
‘ప్రస్తుతం గ్లోబల్ ఆయిల్ డిమాండ్లో ఇండియా వాటా 5 శాతం ఉంది. ఇది రానున్న పదేళ్లలో 11 శాతానికి పెరుగుతుందని అంచనా. అదే గ్యాస్ డిమాండ్ ఏకంగా 500 శాతం వరకు పెరుగుతుందని అంచనావేస్తున్నాం’ అని మోడీ పేర్కొన్నారు. ఎనర్జీ సెక్టార్లో డిమాండ్ భారీగా ఉందని, ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశాలు బోలెడున్నాయని వివరించారు. కిందటేడాది గ్లోబల్గా సంక్షోభం వచ్చినా, ఇండియా స్ట్రాంగ్గా నిలబడగలిగిందని అన్నారు. ఇండియా ఎనర్జీ వీక్ 2023 లో వివిధ కార్పొరేట్ కంపెనీల లీడర్లు, ఇండస్ట్రీ ఎక్స్పర్టులు, మినిస్టర్లు పాల్గొన్నారు. ఇండియా జీ20 ప్రెసిడెన్సీలో జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్ ఇదే.
గ్రామాలకు ఇంటర్నెట్..
ఆప్టికల్ ఫైబర్ గురించి మోడీ మాట్లాడారు. గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించేందుకు 6 లక్షలకు పైగా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను వేశామని చెప్పారు. తొమ్మిదేళ్ల క్రితంతో పోలిస్తే బ్రాడ్ బ్యాండ్ యూజర్లు 13 రెట్లు పెరిగారని, ఇంటర్నెట్ కనెక్షన్స్ మూడు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఆయిల్ రిఫైనింగ్ గురించి మాట్లాడుతూ, రిఫైనింగ్ కెపాసిటీ 250 నుంచి 450 ఎంఎంపీటీఏకి విస్తరించిందని మోడీ వివరించారు. గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్ వచ్చే నాలుగైదేళ్ళలో 22 వేల కి.మీ నుంచి 35 వేల కి.మీ పెరుగుతుందన్నారు. నేచురల్ గ్యాస్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వన్ గ్రిడ్ వన్ నేషన్ ద్వారా ఇందుకు అవసరమయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎల్ఎన్జీ టెర్మినల్ రీగ్యాసిఫికేషన్ కెపాసిటీని పెంచే పనిలో ఉన్నామని మోడీ అన్నారు. దేశంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) తొమ్మిది రెట్లు పెరిగిందని, సీఎన్జీ స్టేషన్లు 2014 లో 900 ఉండగా, ప్రస్తుతం 5 వేలకు పెరిగాయని వివరించారు.
క్రూడ్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లొరేషన్ను, ప్రొడక్షన్ను పెంచేందుకు ‘నో–గో’ ఏరియాను తగ్గించామని, ఇప్పటి వరకు 10 లక్షల చదరపు కి.మీ ఏరియా ‘నో–గో’ ఏరియా లిస్టు నుంచి బయటకొచ్చిందని మోడీ అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్ను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రానున్న ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం రూ. 10 లక్షల కోట్లను కేటాయించామని పేర్కొన్నారు. నెట్ జీరోకి మారేందుకు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీకి రూ.35 వేల కోట్లు కేటాయించామన్నారు. ఈ ఈవెంట్లో ట్విన్ సోలార్ కుక్ టాప్స్ను, రిలయన్స్ హైడ్రోజన్ ట్రక్ను మోడీ వర్చువల్గా లాంచ్ చేశారు.
20% ఇథనాల్..
20 శాతం ఇథనాల్ కలిసిన పెట్రోల్ను ప్రధాని మోడీ సోమవారం లాంచ్ చేశారు. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కొన్ని పెట్రోల్ పంపుల్లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్లో 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ చేస్తున్నారు. ‘2014 లో పెట్రోల్లో 1.5 శాతం ఇథనాల్ బ్లెండింగ్ జరిగేది. దీన్ని 10 శాతానికి పెంచాం. ప్రస్తుతం 20 శాతం వైపు కదులుతున్నాం’ అని మోడీ వివరించారు.