నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు.. మోహన్ బాబు వార్నింగ్

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు..  మోహన్ బాబు వార్నింగ్

తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు ట్విట్టర్  లో ఓ లేఖను రిలీజ్ చేశారు.  ఈ మధ్య కాలంలో తన పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. దయచేసి ఏ పార్టీ వారైనా తన పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.  

మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం.చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమన్నారు మోహన్ బాబు. తనకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేశారు.  ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నానని మోహన్ బాబు లేఖలో  తెలిపారు.  అయితే మోహన్  బాబు ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారన్నది మాత్రం చెప్పలేదు.  

సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న టైమ్ లోనే రాజకీయాల్లోకి వచ్చారు మోహన్ బాబు. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. టీడీపీ తరఫున 1996 నుండి 1997 వరకు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మరణానతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు మోహన్ బాబు.