ఎంత టాలెంట్ ఉన్నా ట్రాన్స్జెండర్ కావడం వల్ల ఉద్యోగాలు రాని వాళ్లు చాలామందే ఉన్నారు. ఆ కమ్యూనిటీని సొసైటీకి దగ్గర చేయాలని, వాళ్లకి ఆసరా కల్పించాలని ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెట్టాడు రాజేష్ పాటిల్. ఈయన పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్.
జులై 1 నుంచి జరిగిన రిక్రూట్మెంట్లో దాదాపు 35 మందికి పైగా ట్రాన్స్జెండర్లకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారు. అందులో సఫాయి కార్మికులు, సెక్యూరిటీ గార్డ్స్, గ్రీన్ మార్షల్స్ కూడా ఉన్నారు. ఇంతకుముందు పింప్రి చించ్వాడ్లో ట్రాన్స్జెండర్లను పబ్లిక్ టాయిలెట్స్ వాడనివ్వట్లేదని, ఆ కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్ కట్టించింది అక్కడి మున్సిపల్ కార్పొరేషన్. అంతేకాకుండా 2022–23 సంవత్సర బడ్జెట్లో ఈ కమ్యూనిటీ కోసం 24లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించింది కూడా. ‘నేను చదువుకున్నాను. ఆ సర్టిఫికెట్ చూపించి ఉద్యోగం అడిగితే ‘ఇక్కడ నీకు ఉద్యోగం ఇవ్వరు. వెళ్లి రోడ్లమీద అడుక్కో’ అనేవాళ్లు చాలామంది. ఇప్పుడు ఈ ఉద్యోగంలో చేరినందుకు ఆనందంగా ఉంది. నన్ను మాటలనేవాళ్లు కూడా ఇక్కడ ఎవరూలేరు’ అని సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్న రూప తక్సల్ చెప్పింది. ‘కొన్ని ఎన్జీవోల ద్వారా వీళ్ల డాటా సేకరించాం. ఉద్యోగ అవకాశం ఇవ్వడం వల్ల ట్రాన్స్జెండర్లకు సొంత గుర్తింపు రావడానికి, సొసైటీలో గౌరవంగా బతకడానికి సాయపడుతుంది’ అన్నాడు రాజేష్ పాటిల్.