కీవ్: అమెరికా, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు అందించిన మిలిటరీ ఎక్విప్మెంట్, ఆయుధాలను రష్యా ధ్వంసం చేసింది. అమెరికా, యూరోపియన్ దేశాల నుంచి భారీ స్థాయిలో మిలిటరీ ఎక్విప్మెంట్ కన్సైన్మెంట్ ఖార్కివ్ రీజియన్లోని బోగోదుఖోవ్ రైల్వే స్టేషన్కు చేరుకుందని, వాటిని రైల్వే స్టేషన్లోనే ధ్వంసం చేశామని రష్యా అధికార ప్రతినిధి ఇగోర్ కోనాషెంకోవ్ శనివారం వెల్లడించారు. వైమానిక దాడులు చేసి 48 యూనిట్ల వెపన్స్, ఇతర మిలిటరీ ఎక్విప్మెంట్తో పాటు 280 మంది ఉక్రెయిన్ జవాన్లను తుడిచిపెట్టేసినట్టు తెలిపారు. ఖార్కివ్ రీజియన్లోని స్కోవోరోడ్నికోవో జిల్లాలోని రెండు కమాండ్ పోస్టులు, అలాగే ఒడెస్సా రీజియన్లోని మూడు ఆయుధాగారాలు, ఫ్యూయల్ డిపోలు ఎయిర్ స్ట్రయిక్స్లో ధ్వంసమైనట్లు ప్రకటించారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు అమెరికా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నాయి. ఆర్థికంగానే కాకుండా మిలిటరీ పరంగానూ సాయం చేస్తున్నాయి. విదేశాల సహాయం వల్లే ఉక్రెయిన్లో పరిస్థితులు దిగజారుతున్నాయని, సంక్షోభం కొనసాగుతోందని రష్యా చెబుతోంది.
మరియుపోల్ నుంచి 50 మంది తరలింపు
ఉక్రెయిన్–రష్యా వార్లో కేంద్ర బిందువుగా ఉన్న మరియుపోల్లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అజోవ్స్టల్ స్టీల్ ప్లాంట్ను చేజిక్కించుకోవడానికి రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే లోపల బంకర్లు, టన్నెల్స్లో దాకున్న ఉక్రెయిన్ సైనికులు రష్యా ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్లాంట్ లోపల చిక్కుకుపోయిన దాదాపు 50 మందిని శుక్రవారం మరియుపోల్ దాటించారు. వీరిని ఐక్యరాజ్యసమితి, ఇంటర్నేషనల్ రెడ్క్రాస్ ప్రతినిధులకు అప్పగించారు. ఈ గ్రూప్లో 11 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు రష్యన్ సైనికులు చెప్పారు. కాగా, ఉక్రెయిన్లో తాజా పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్లో శాంతి నెలకొనాలంటూ యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు ఐక్యరాజ్యసమితి సెక్యురిటీ కౌన్సిల్ మద్దతు తెలిపింది.
డ్రోన్లతో ఉక్రెయిన్ ఆర్మీ ఎదురుదాడి
రష్యాతో పోరాటంలో ఉక్రెయిన్ అత్యున్నత స్థాయి టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇందుకోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది. సోవియన్ యూనియన్ కాలంనాటి ఆర్కేజీ 3 యాంటీ ట్యాంక్ గ్రనేడ్లను మాడిఫై చేసి డ్రోన్ల సాయంతో రష్యన్ ట్యాంకర్లపై వదులుతోంది. ఇందుకోసం అత్యాధునిక 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని వాడుతోంది. కాలం చెల్లిన ఈ గ్రనేడ్లకు 3డీ ప్రింటెడ్ ప్లాస్టిక్ పిన్స్ను అటాచ్ చేస్తోంది. ఎలాంటి చప్పుడు, హెచ్చరికలు లేకుండా డ్రోన్ల నుంచి జారవిడవగానే ఈ పిన్స్ ధ్వంసమై గ్రనేడ్లు పేలుతున్నాయి. రష్యన్ ట్యాంకర్లలో ఎలాంటి రక్షణా లేకుండా ఉంటున్న సైనికులను ఇవి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో డ్రోన్లు ఎటునుంచి వచ్చి బాంబులు జార విడుస్తాయో అనే ఆందోళన రష్యన్ సైనికులను పట్టిపీడిస్తోంది.