న్యూఢిల్లీ : మన దేశంలోని ఉద్యోగులలో మూడో వంతు మంది జాబ్ మారాలని కోరుకుంటున్నారట. కెరీర్లో ముందుకెళ్లకుండా అడ్డంకులు ఎదురవుతున్నట్లు 71 శాతం మంది ఫీలవుతున్నారంట. పీడబ్ల్యూసీ ఇండియా రిలీజ్ చేసిన తాజా రిపోర్టు ఈ విషయం వెల్లడించింది. గత రెండేళ్లలో దేశంలోని వర్క్ప్లేస్లలో చాలా మార్పులు వచ్చాయని, ఎంప్లాయర్లు, ఎంప్లాయీలు ఇద్దరిలోనూ ఈ మార్పులు కనిపిస్తున్నాయని రిపోర్టు తెలిపింది. నిపుణులైన ఉద్యోగులతో కంపెనీలను నింపుకోవాలని ఎంప్లాయర్లు చూస్తుంటే, మరోవైపు డబ్బుతోపాటు క్రియేటివిటీ, ఇన్నొవేషన్ ఉండే చోట్ల ఆపర్చునిటీస్ కోసం ఉద్యోగులు ఉవ్విళ్లూరుతున్నారని పీడబ్ల్యూసీ రిపోర్టు పేర్కొంది. ఇండియా వర్క్ఫోర్స్ హోప్స్ అండ్ ఫియర్స్ సర్వే 2022 పేరిట ఈ రిపోర్టును విడుదల చేసింది.
మిలినియల్సే ఎక్కువ....
గ్లోబల్గా వర్క్ఫోర్స్పై చేసిన సర్వే నుంచే ఇండియా రిపోర్టును పీడబ్ల్యూసీ తయారు చేసింది. ఈ సర్వేలో మన దేశం నుంచి 2,608 మంది పాల్గొన్నట్లు పీడబ్ల్యూసీ తెలిపింది. వారిలో 93 శాతం మంది ఫుల్టైమ్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లేనని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం ఇండియాలోని ఉద్యోగులలో మూడొంతుల మంది (34 శాతం) ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలకు గుడ్బై చెప్పాలనుకుంటున్నారు. గ్లోబల్గా చూస్తే ఇలా కొత్త కంపెనీలో చేరాలనుకుంటున్న వారు 19 శాతం మందే ఉన్నారని రిపోర్టు వెల్లడించింది. ఉద్యోగాలు మానేయాలనుకుంటున్నట్లు 32 శాతం మంది చెప్పినట్లు సర్వే రిపోర్టు తెలిపింది. ముఖ్యంగా మిలినియల్స్లో కొత్త ఉద్యోగాలు కావాలనుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నట్లు పేర్కొంది. వారిలో 37 శాతం మంది రాబోయే ఏడాది కాలంలో కొత్త కంపెనీలను వెతుక్కోవాలనుకుంటున్నట్లు వివరించింది. కానీ, జెనరేషన్ జెడ్ ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలను అంటి పెట్టుకుని ఉండాలనుకుంటున్నట్లు పీడబ్ల్యూసీ సర్వే తేల్చింది. అయితే వారిలో మూడో వంతు మంది తమ పని గంటలను తగ్గించమని ఎంప్లాయర్లను కోరాలనుకుంటున్నట్లు పేర్కొంది.
ఆయా దేశాలలోని సోషల్, ఎన్విరాన్మెంటల్, ఎకనమిక్, జియో పొలిటికల్ మార్పులు అక్కడి సంస్థల వర్క్ఫోర్స్ స్ట్రేటజీపై ఎఫెక్ట్ చూపిస్తాయని పీడబ్ల్యూసీ పార్ట్నర్ చైతాలి ముఖర్జీ చెప్పారు. ఆర్గనైజేషన్ అవసరాల కోసం షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్లు వేసుకునేటప్పుడు పై అంశాలను లీడర్లు దృష్టిలో పెట్టుకోవల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తు కోసం ప్రిపేర్ అవడానికి ఉద్యోగుల ఆలోచనలతో సమానమైన ఆలోచనలు చేయడం ఎంప్లాయర్లకు తప్పనిసరని ముఖర్జీ చెప్పారు. కొలీగ్స్ నుంచి టెక్నాలజీ స్కిల్స్ పెంపొందించుకునే ఛాన్స్ లేదని సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది భావిస్తున్నట్లు పీడబ్ల్యూసీ రిపోర్టు వెల్లడించింది. వర్క్లో సరయిన అవకాశాలు రావడం లేదనీ ఆ సగం మంది ఫీలవుతున్నట్లు పేర్కొంది. ఈ లెర్నింగ్ గ్యాప్ టాప్ లెవెల్లోనే మొదలవుతోందని, సీఈఓలలో 50 % మంది టెక్నాలజీ స్కిల్స్ నేర్చుకునే ఛాన్స్ ఉండటం లేదని చెబుతున్నట్లు రిపోర్టు వివరించింది.