మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో తల్లీకూతురు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రం రైల్వే ఓవర్బ్రిడ్జి సమీపంలోని బృందావన్ కాలనీలో పూదరి విజయలక్ష్మి(47), ఆమె కూతురు రవీనా(23) నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం పనిమనిషి వచ్చి ఎంత పిలిచినా తలుపులు తీయలేదు. దీంతో పక్కన ఉండేవారికి చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఇద్దరూ చనిపోయి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, ఏసీపీ అఖిల్మహాజన్, టౌన్సీఐ ముత్తి లింగయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లీ కూతురును గొంతునులిమి హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. సింగరేణి ఉద్యోగి అయిన విజయలక్ష్మి భర్త చనిపోవడంతో కొడుక్కు డిపెండెంట్ ఉద్యోగం వచ్చింది. అతడు ఫ్యామిలీతో భూపాలపల్లిలో ఉంటున్నాడు.
ఫేస్ బుక్లో ప్రేమ.. పెళ్లి
నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన అరుణ్కుమార్ ఫేస్బుక్ద్వారా రవీనాకు పరిచయమయ్యాడు. వీరిద్దరు నిరుడు కుటుంబసభ్యుల సమక్షంలో లవ్మ్యారేజ్ చేసుకున్నారు. అరుణ్కుమార్ జులాయిగా తిరుగుతూ రవీనాను వేధించడంతో నాలుగు నెలలకే గొడవలు మొదలయ్యాయి. అప్పటినుంచి ఆమె తల్లి దగ్గరే ఉంటోంది. అరుణ్కుమార్వారిపై దుష్ర్పచారం చేస్తూ వేధిస్తున్నాడు. మంచిర్యాల విమెన్పోలీస్స్టేషన్లో పలుసార్లు కౌన్సెలింగ్నిర్వహించినా మారలేదు. దీంతో వారం కిందట టౌన్ పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అరుణ్కుమార్తో తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు గురువారం తల్లీకూతుళ్ల స్టేట్మెంట్ను కోర్టులో రికార్డ్చేశారు. విషయం తెలుసుకున్న అరుణ్కుమార్ రాత్రి ఇంటికి వచ్చి గొడవ పడ్డాడని బంధువులు చెప్పారు. తెల్లవారేసరికి వారిద్దరు హత్యకు గురవడంతో అరుణ్కుమారే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. బంధువుల కంప్లైంట్ మేరకు కేసు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు టీంలను నియమించారు.