- పాలమూరు పౌరుషాన్ని సీఎం చూపాలి
- తొండలిడుసుడు కాదు.. లోపలేయడానికే అధికారం ఇచ్చిన్రు
- కవిత ఆరోపణలపై కేటీఆర్, హరీశ్రావు మౌనమేల..?
- నిజామాబాద్ ఎంపీ అర్వింద్ .
నిజామాబాద్, వెలుగు: విద్యా, వైద్య రంగాలను నాశనం చేసి కూలిపోయే డ్యాంలు కట్టిన కేసీఆర్ఇప్పుడు బయటకు వచ్చి సూక్తులు చెప్పడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను నమ్మించి ద్రోహం చేయడంలో ఆయన్ను మించిన ఘనులు లేరన్నారు. ఆదివారం నిజామాబాద్లోని ఫంక్షన్హాల్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ మద్దతుదారులను సన్మానించిన ఆయన ప్రసంగించారు.
చాలా రోజుల తర్వాత మీడియా ఎదుటకు వచ్చిన కేసీఆర్చాదస్తం, వైరాగ్యాన్ని చూపి వెళ్లారన్నారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నారో చెబుతారనుకుంటే పాత పురాణమంతా మళ్లీ చెప్పుకొచ్చారని విమర్శించారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని సీఎం రేవంత్రెడ్డి జైల్లో వేయాలని, ప్యాకేజీలకు సరెండర్కావొద్దన్నారు. కేసీఆర్ను లోపలేయడానికే ప్రజలు కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారనే విషయాన్ని మరువొద్దని, లాగులో తొండలు ఇడువడానికి కాదన్నారు.
పాలమూరు పౌరుషాన్ని చూపాల్సిన టైం రేవంత్రెడ్డికు వచ్చిందన్నారు. కేటీఆర్, హరీశ్ రావుపై కవిత డైరెక్ట్ఆరోపణలు చేస్తుంటే వారిద్దరు ఏ ముఖం పెట్టి ప్రజల ముందు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కేటీఆర్తన ప్రసంగాల్లో తరచూ కేసీఆర్ వయస్సును ప్రస్తావించడం వెనుక మతలబు దాగిఉందన్నారు. ఉద్యమ నేతగా కేసీఆర్అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ ఇరిగేషన్ప్రాజెక్టుల పేరుతో రూ.50 వేల కోట్లు లూటీ చేసి పాపాత్ముడిగా మిగిలిపోయారన్నారు.
పార్లమెంట్సెగ్మెంట్ పరిధిలో 96 మంది బీజేపీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలువడం రానున్న రోజుల్లో గొప్ప మార్పునకు సంకేతమన్నారు. అవినీతికి తావులేని పారదర్శక సేవలు అందించి గెలిచిన గ్రామాలు డెవలప్ చేయాలని సూచించారు. నేషనల్ టర్మరిక్ బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ప్రెసిడెంట్లు దినేష్ కులాచారి, యాదగిరిబాబు, మోహన్రెడ్డి, మేడపాటి ప్రకాష్రెడ్డి, స్రవంతిరెడ్డి తదితరులు ఉన్నారు.
