దమ్ముంటే రాజీనామా చేసి కవితపై పోటీ చెయ్ : కౌశిక్ రెడ్డి

దమ్ముంటే రాజీనామా చేసి కవితపై పోటీ చెయ్ : కౌశిక్ రెడ్డి

కరీంనగర్ జిల్లా: బీజేపీ ఎంపీ అర్వింద్ కు ధైర్యం ఉంటే రాజీనామా చేసి కల్వకుంట్ల కవితపై పోటీ చేయాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కవితపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించే ప్రసక్తేలేదని హెచ్చరించారు. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ నేతలు, ఎంపీ అర్వింద్ తీరుపై మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ ను  చెప్పుతో కొట్టాలంటే కవితక్క చెప్పు కూడా సిగ్గు పడుతుందన్నారు. బీజేపీ వారు గుండాల్లా కవితక్క ఇంటికి వచ్చి దాడి చేసిన రోజు లెక్క పత్రం లేదా..? అని ప్రశ్నించారు. 

నోరు అదుపులో పెట్టుకోకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కౌశిక్ రెడ్డి ఎంపీ అర్వింద్ ను హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత గురించి మాట్లాడితే నాలుక కోస్తామని అన్నారు. మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పినా బీజేపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. మత కల్లోలాలు సృష్టించి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన.. అర్వింద్ దిష్టిబొమ్మ దహనం

కల్వకుంట్ల కవిత పట్ల ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు  జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. బీజేపీ.. అర్వింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అర్వింద్ మాటతీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అర్వింద్ దిష్టి బొమ్మను దహనం చేశారు.