హైదరాబాద్, వెలుగు : అసత్య ఆరోపణలతో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్, మరో అయిదుగురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లలో మార్చి 27న నమోదైన కేసుల్ని కొట్టేయాలని కోరారు. హోలీ సందర్భంగా పిట్టలబస్తీలో జరిగిన గొడవలో బాధితులను పరామర్శించడానికే వెళ్లినట్లు పిటిషన్లో వివరించారు. తనపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. దురుద్దేశంతో, వ్యక్తిగత కక్షతో పెట్టిన కేసును కొట్టేయాలని కోర్టును రిక్వెస్ట్ చేశారు.