చేవెళ్లలో రైల్వే సమస్యలు పరిష్కరించండి: ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్లలో రైల్వే సమస్యలు పరిష్కరించండి: ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి
  • దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి భేటీ

హైదరాబాద్​సిటీ/వికారాబాద్, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న రైల్వే సమస్యలపై మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవతో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా నావంద్గీ రైల్వే స్టేషన్​లో హుబ్లీ ఎక్స్​ప్రెస్​ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్లమెంట్ పరిధిలో నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ ప్రగతిపై చర్చించారు. 

వికారాబాద్, తాండూరు రహదారిలో కోర్టు దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ పై నిర్మించే ఆర్​వోబి, రామయ్య గూడ వద్ద రైల్వే ట్రాక్​పై నిర్మించే ఆర్​వోబీల కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. శంకర్ పల్లి రైల్వే స్టేషన్ ను ఆధునికరించడానికి, శంకర్​పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్ యూబీ నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి  రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. సమావేశంలో డీజీఎంలు ఉదయనాథ్, మల్లాది శ్రీనివాస్, సీపీఆర్​వో శ్రీధర్ ఉన్నారు.