తెలంగాణ లో కరోనా వ్యాప్తి కి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి పాక్షికంగా ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి. కరోనా నిర్ములనకు కాంగ్రెస్ పార్టీ సూచించిన ట్రేస్ టెస్ట్ ట్రీట్(Trace Test Treat) విధానంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, పూర్తి స్థాయిలో కరోనా టెస్టులు చేయడం లేదని అన్నారు.
మంగళవారం కూకట్ పల్లి మున్సిపల్ జోనల్ ఆఫీస్లో N90 మాస్కులు అందజేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా చాలా నిబద్ధతతో లాక్ డౌన్ పాటించినా… కేసీఆర్ ఆదాయం కోసం వైన్ షాపులు ఓపెన్ చేయడంతో లాక్ డౌన్ విఫలం అయిందన్నారు.
విద్య సంస్థ లాల్లో ఫీజులు పెంచడానికి వీలు లేదని చెప్పిన సీఎం.. అందుకు సంబంధించిన జీఓ విడుదల చేసిన రెండు రోజులకే మెడికల్ కాలేజి ఫీజులు పెంచారన్నారు. ఓ ప్రముఖ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చి ఓ వ్యక్తి చనిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచారని, వైరస్ వల్ల చనిపోతే వారికి ధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదన్నారు.
జర్నలిస్టులకు ఆరు నెలల పాటు పదివేల చొప్పున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని సహాయం చేయాలన్నారు రేవంత్. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాస్తానని అన్నారు.