బోథ్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీలు నిర్వహించే నాగోబా జాతరకు రావాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండేను జిల్లా ఎంపీ సోయం బాపురావు, మెస్రం వంశీయులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుధవారం ఢిల్లీలో ఆయనను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత దేశంలోనే అతిపెద్ద గిరిజన నాగోబా జాతరకు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు.
జనవరిలో10 రోజులపాటు జాతర నిర్వహిస్తామని జనవరి 24న నిర్వహించే ప్రజాదర్భార్కు రావాలని ఆయనను కోరారు. కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావ్, మెస్రం ఆనంద్ రావు , మెస్రం చిన్ను పటేల్, మెస్రం బాధిరావు, మెస్రం హన్మంతు, మెస్రం దాధి రావు, కొట్నక్ కోషరావు పాల్గొన్నారు.