
వరంగల్, వెలుగు: హుజూరాబాద్ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎంపీటీసీలు సిద్ధమవుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా తమకు నిధులు లేవని మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే హుజూరాబాద్ఎన్నికలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి నిరసన తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ వేం వాసుదేవరెడ్డి శుక్రవారం వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఎంపీటీసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సర్కారు స్పందించకుంటే హుజూరాబాద్ఎన్నికలో మూకుమ్మడి నామినేషన్లు వేస్తామన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు చేసిన మోసాన్ని హుజూరాబాద్ లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తామని చెప్పారు. గ్రామాల్లో వార్డు మెంబర్కు ఉన్న విలువ కూడా తమకు లేదని, కనీసం జీపీల్లో కుర్చీ కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. నిధులు లేకపోవడం, ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని వాపోయారు. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర కమిటీతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో ఎంపీటీసీల ఫోరం వరంగల్అర్బన్, రూరల్జిల్లాల అధ్యక్షులు సంపత్, ఎంపీటీసీలు రజినీకర్ రెడ్డి, పోగుల ఇందిరా రాజిరెడ్డి పాల్గొన్నారు.