దేశంలోనే మొదటిసారిగా ఒక కంపెనీ షేరు 6 అంకెలను చేరుకుంది. ప్రపంచ సంపన్నులలో ఒకరైన వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్షైర్ హాథ్వే షేరు చాలా ఖరీదైన షేరుగా పేరొందింది. తాజాగా ఇండియాలోని టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ షేరు అత్యంత ఖరీదైనదిగా రికార్డు సృష్టించింది. మంగళవారం ట్రేడింగ్లో ఈ కంపెనీ షేరు రూ. లక్షను తాకింది.
వెలుగు బిజినెస్ డెస్క్: టైర్ల తయారీలోని చెన్నై కంపెనీ ఎంఆర్ఎఫ్ షేరు ధర మంగళవారం అక్షరాల లక్ష రూపాయలను తాకింది. దలాల్ స్ట్రీట్ చరిత్రలో ఒక కంపెనీ షేరు లక్ష ధర పలకడం ఇదే మొదటిసారి. చాలా ఏళ్లుగా ఎంఆర్ఎఫ్ షేరు ధర ఎక్కువ స్థాయిలోనే కొనసాగుతోంది. ఎంఎన్సీ హనీవెల్ ఆటోమేషన్ షేరు రూ. 41,000 ధరతో ఈ జాబితాలో రెండో ప్లేస్లో నిలుస్తోంది. అత్యంత ఖరీదైన షేర్ల జాబితాలో ఆ తర్వాత పేజ్ ఇండస్ట్రీస్, 3ఎం ఇండియా, శ్రీ సిమెంట్, నెస్లే కంపెనీలు ఆ తర్వాత ప్లేస్లలో నిలుస్తున్నాయి. షేరు ధరకి– షేరు విలువకి చాలా తేడా ఉంటుంది. పైన జాబితాలోని కంపెనీల షేర్ల రేట్లే ఎక్కువ. షేర్ల విలువను అనేక పారామీటర్ల ఆధారంగా లెక్కకడతారు. మార్కెట్ క్యాపిటలైజేషన్, ప్రైస్ టూ ఎర్నింగ్స్(పీ ఈ ) రేషియో, ప్రైస్ టూ బుక్ వాల్యూ రేషియో, ఇన్వెస్టర్ల అంచనాలు, గ్రోత్ అవకాశాలు వంటి వాటి ద్వారా షేర్ల విలువను లెక్కిస్తారు.
ఫండమెంటల్స్ ఆధారంగా ఎంఆర్ఎఫ్ షేర్లను అమ్ముకోవాలని చాలా బ్రోకరేజ్లు సెల్ రేటింగ్స్ ఇచ్చాయి. అయితే, మరోవైపు టెక్నికల్ ఎనలిస్టులు మాత్రం ఈ షేరు ఇంకా దూసుకెళ్లే ఛాన్స్లు ఉన్నాయని చెబుతున్నారు.
ఎంఆర్ఎఫ్ షేరుకు రూ. 95,000 ధర స్ట్రాంగ్ సపోర్టు లెవెల్. దీపావళిలోపు ఈ షేరు రూ. 1.25 లక్షలను కూడా తాకే ఛాన్స్ ఉంది.
వైభవ్ కౌషిక్,రీసెర్చ్ ఎనలిస్ట్, జీసీఎల్ బ్రోకింగ్