- జేపీఎల్ చైర్మన్గా మాత్రం కొనసాగింపు
న్యూఢిల్లీ: మనదేశంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ రిలయన్స్లో భారీ మార్పు జరిగింది. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ టెలికం విభాగం జియో నుంచి తప్పుకున్నారు. పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి బాధ్యతలను అప్పగించారు. ఆకాశ్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్కు నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 217 బిలియన్ డాలర్ల విలువైన రిలయన్స్కంపెనీకి రిఫైనింగ్ మొదలు రిటైల్, మీడియా, ఎనర్జీ సహా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. 65 ఏళ్ల అంబానీకి ముగ్గురు సంతానం. ఆకాశ్, ఇషా కవలలు కాగా, అనంత్ చిన్నవాడు.
పిరమల్ గ్రూప్ చీఫ్ అజయ్పిరమల్ కొడుకు ఆనంద్ను పెళ్లాడిన ఇషాకు రిటైల్ బిజినెస్ బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఆకాష్, ఇషా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) బోర్డులలో 2014 అక్టోబర్ నుండి ఉన్నారు. ఆర్ఆర్వీఎల్.. కన్జూమర్, కిరాణా, ఫ్యాషన్, నగలు, ఫుట్వేర్, దుస్తులు, జియోమార్ట్ లను, జియో ప్లాట్ఫార్మ్స్ లిమిటెడ్ (జేపీఎల్) నిర్వహిస్తుంది. 26 ఏళ్ల అనంత్ ఇటీవలే ఆర్ఆర్వీఎల్లో డైరెక్టర్గా చేరారు. ఆయన మే 2020 నుండి జేపీఎల్లోనూ డైరెక్టర్. ఈ ఏడాది జూన్ 27 నుండి ఐదేళ్లపాటు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ నియమితులయ్యారు. కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి రమీందర్ సింగ్ గుజ్రాల్ , మాజీ సీవీసీ కేవీ చౌదరి స్వతంత్ర డైరెక్టర్లుగా అపాయింట్ అయ్యారు.
మూడు ముఖ్యమైన వ్యాపారాలు
రిలయన్స్ మూడు ప్రధాన వ్యాపారాలు ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, టెలికామ్తో సహా రిటైల్ డిజిటల్ సేవలు. రిటైల్, డిజిటల్ సేవలు వేర్వేరు పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థలలో ఉన్నాయి. ఓ2సీ వ్యాపారం రిలయన్స్ ఫంక్షనల్ డివిజన్. ఎనర్జీ విభాగం మాత్రం పేరెంటల్ కంపెనీకి చెందుతుంది. మూడు వ్యాపారాల పరిమాణం దాదాపు సమానంగా ఉంటుంది. ఆకాష్, ఇషా ఇద్దరూ రిటైల్ టెలికాం గ్రూప్ వ్యాపారాలలో చురుకుగా ఉన్నారు. అనంత్ డైరెక్టర్గా రిలయన్స్ చమురు, రసాయన యూనిట్ల కోసం పనిచేస్తున్నారు. అంబానీ నెట్వర్త్ 109 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
భార్య 59 ఏళ్ల నీతా కూడా రిలయన్స్ బోర్డులో ఉన్నారు. అయితే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్తో సహా అన్ని జియో డిజిటల్ సేవల బ్రాండ్లతో ఏర్పడ్డ ఫ్లాగ్షిప్ కంపెనీ జియో ప్లాట్ఫారమ్ లిమిటెడ్కు ఇక నుంచి కూడా ఆయన ఛైర్మన్గా కొనసాగుతారు. కంపెనీ ఫైలింగ్ల ప్రకారం, రిలయన్స్లో అంబానీ కుటుంబం ప్రస్తుత వాటా మార్చి 2019లో 47.27 శాతం నుండి 50.6 శాతానికి పెరిగింది.
కిందటి ఏడాది డిసెంబర్ 28న గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ జన్మదినాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా అంబానీ తొలిసారి వారసత్వ ప్రణాళిక గురించి మాట్లాడారు. తన సంతానం కంపెనీలో మరింత చురుకైన పాత్ర పోషిస్తారని ప్రకటించారు. రిలయన్స్ జియో ప్లాట్ఫారమ్లలో 32.97 శాతం వాటాను గూగుల్, ఫేస్బుక్ ఇతర వెంచర్ క్యాపిటల్లకు అమ్మింది.